కొండగట్టు అభివృద్ధి పనులకు సీఎం గ్రీన్ సిగ్నల్

కొండగట్టు | సెప్టెంబర్ 10:జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ అంజన్న స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీటీడీ నిధులు రూ.35.19 కోట్లతో చేపట్టనున్న దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణ పనులకు సీఎం ఆమోదం తెలిపినట్లు చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం తెలిపారు.కొండగట్టు ఆలయ అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రిని కలిసి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి పనులకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.దీక్షా విరమణ మండపంలో ఒకేసారి సుమారు 2,000 మంది భక్తులు దీక్ష విరమించుకునేలా నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే భక్తుల వసతి కోసం 96 గదుల సత్రం నిర్మించనున్నారు.టీటీడీ నిధులతో చేపట్టనున్న ఈ పనులకు త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు
