శ్రావణమాసం చివరి మంగళవారం.. కొండగట్టు అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు


కొండగట్టు | సెప్టెంబర్ 8:శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ అంజన్న స్వామి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండగట్టుకు చేరుకుని క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని తమలపాకులు, కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 30 వేల మందికి పైగా భక్తులు కొండగట్టుకు వచ్చినట్లు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజన్నరెడ్డి స్వయంగా ఆలయంలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తూ భక్తులకు ప్రశాంతంగా దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టారు.ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో కొండగట్టు ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది
