కొండగట్టు అంజన్న సన్నిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్.. హైడ్రాపై కీలక వ్యాఖ్యలు

కొండగట్టు | సెప్టెంబర్ 8:జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రంగనాథ్ గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో అంజన్నరెడ్డి రంగనాథ్ను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. శ్రావణమాసంలో అంజన్న స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. హైడ్రాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రజలు హైడ్రాకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.హైడ్రా పరిధిలో 3,350 ఎకరాల భూములు ఉండగా, సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ తెలిపారు. భూములు, చెరువులను పరిరక్షించేందుకే హైడ్రా పనిచేస్తోందని, ఏ ఒక్కరికీ అన్యాయం చేయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.చెరువులు, భూములను భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హైడ్రా చర్యలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని పేర్కొన్నారు. చట్టం అందరికీ ఒకే విధంగా వర్తిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు
