తాతా మధు దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్ ఆగ్రహం.. మల్యాలలో ఉద్రిక్తత

మల్యాల | సెప్టెంబర్ 8:జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన చేపట్టారు. దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను తాతా మధు దూషించారంటూ ఆరోపిస్తూ మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.మల్యాల బ్లాక్ చౌరస్తాలో తాతా మధు దిష్టిబొమ్మతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు

ఈ సందర్భంగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉండటాన్ని జీర్ణించుకోలేకనే అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. దళితుల పట్ల అవమానకరమైన లేదా వివక్షాపూరిత చర్యలను కాంగ్రెస్ పార్టీ సహించబోదని స్పష్టం చేశారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మల్యాల పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతా మధుపై ఫిర్యాదు చేశారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

కాంగ్రెస్ నాయకురాలు, మల్యాల వార్డు మెంబర్ గాండ్ల జ్యోతి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ముందుగా తమ పదేళ్ల పాలనకు సంబంధించిన లెక్కలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుండటాన్ని ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు నిరసనలకు దిగుతున్నారని ఆమె విమర్శించారు.దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
